
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల తొలగింపు నిరంతరం కొనసాగాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాకు ఎదురుగా ఉన్న ఆడ్హాక్ కమిటీ సభ్యుడు నాగన్ గౌడ్కు చెందిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య తొలగించిన చర్యను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ స్వాగతించారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో మున్సిపల్ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
అయితే, ఐజ మున్సిపాలిటీ పరిధిలో గతంలోనూ అనేక అక్రమ నిర్మాణాలు జరిగాయని, ప్రస్తుతం కూడా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారిపై కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు కేవలం కొందరికి మాత్రమే పరిమితం కాకుండా, చట్టం ముందు అందరూ సమానులనే సూత్రంతో అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారిపై ఒకే విధంగా అమలు చేయాలని కోరారు. ఎంపిక చేసిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలకు తావు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, రహదారులు, వాగులు, కాలువలు మరియు ఇతర ప్రజా స్థలాలను ఆక్రమించిన వారందరిపై సమగ్ర సర్వే నిర్వహించి, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమ ఆక్రమణలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఏ వర్గానికి, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
వాగులు, రోడ్లు, ప్రజా మార్గాలను ఆక్రమించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్న మొరుగు వీరేష్, ఈ అంశంపై ప్రభుత్వం మరియు ఐజ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక తీర్మానం చేసి, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని అక్రమ ఆక్రమణలను దశలవారీగా తొలగించే చర్యలను వెంటనే ప్రారంభించాలని కోరారు.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, పట్టణాభివృద్ధి లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఆయన ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.
